మరోసారి గొప్ప మనసు చాటిన ఆనంద్ మహీంద్రా

మరోసారి గొప్ప మనసు చాటిన ఆనంద్ మహీంద్రా

కష్టాల్లో ఉన్నవారి పట్ల ఉదారత చూపే అతికొద్ది వ్యాపారవేత్తల్లో ఆనంద్‌ మహీంద్రా ఒకరు. గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన 80 ఏళ్ల వయసులో రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్న ‘ఇడ్లీ బామ్మ’ కమలాత్తాళ్ కు ఆనంద్‌ మహీంద్రా అండగా నిలిచారు. త్వరలోనే ఆమె సొంత ఇంటి కల నెరవేరనున్నట్లు మహీంద్రా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. కోయంబత్తూరుకు చెందిన కమలాతాల్ 2019లో కేవలం 1రూపాయకే ఇడ్లీలు వండి అమ్మడంతో ‘ఇడ్లీ బామ్మ’గా వైరల్ అయింది.



30 ఏళ్లుగా ఆమె తన వ్యాపారాన్ని కట్టేల పొయ్యి మీద చిన్న ఇంట్లో నుంచే నడుపుతోంది. అయితే, ఆమె లాభాల కోసం కాకుండా రోజుకు వెయ్యి ఇడ్లీల వరకు అమ్ముతూ నిరుపేద జీవితాలకు తనవంతు సాయం చేస్తున్నారు. అయితే, ఈ సమాచారం ఆనంద్ మహీంద్రాకు చేరడంతో తనకు అండగా ఉంటానని గతంలో పేర్కొన్నారు. వెంటనే వంటగ్యాస్‌కు అయ్యే ఖర్చును భరించడంతో పాటు ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెడతానని కూడా మహేంద్రా పేర్కొన్నారు.

తాజాగా మహీంద్రా మరోసారి ఆ బామ్మ వీడియో తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. కమలాత్తాళ్‌కు త్వరలోనే కొత్త ఇంటిని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ‘‘ఒకరి స్ఫూర్తిమంతమైన జీవితంలో చిన్న భాగమయ్యే అరుదైన అవకాశం చాలా కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది. నాకు ఆ అవకాశాన్ని కల్పించిన ఇడ్లీ అమ్మ కమలాత్తాళ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. త్వరలోనే ఆమెకు సొంత ఇల్లుతో పాటు పనిప్రదేశం కూడా రాబోతోంది’’ అని మహీంద్రా ట్వీట్‌ చేశారు.



ఈ సందర్భంగా కమలాత్తాళ్‌ వ్యాపారంలో ఎలా పెట్టుబడి పెట్టాలో చెప్పిన మహీంద్రారైజ్‌ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రస్తుతం బామ్మకు కావాల్సింది కొత్త ఇంటి స్థలం.. ఆమె పేరున భూమిని రిజిస్టర్‌ చేసి మాకు సాయపడిన తాండమూత్తూర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి ధన్యవాదాలు’ అని మహీంద్రా ట్విటర్‌లో పేర్కొన్నారు. త్వరలోనే మహీంద్రా కంపెనీ బృందం ఆమె కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కమలాత్తాళ్‌కు ఇప్పటికీ వంటగ్యాస్‌ అందిస్తోన్న భారత్‌గ్యాస్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *